గృహ నిర్మాణం




గృహ నిర్మాణంలో కొలతలు చాలా ముఖ్యమైనవి. కొలతలు సరిగా లేని గృహం ఫలితశూన్యం అని గ్రహించాలి. చాలా మంది గృహస్థులకు కొలతలు విషయంలో ఎటువంటి అవగాహన వుండదు. 'గృహనిర్మాణంలో కొలతలు ఏయే దశలలో ఏ విధంగా ఆచరించాలి' అనే విషయం గురించి ఈ అంశంలో వివరించడం జరిగింది. కొలతలకు సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా గృహస్థుల గృహంపై ఖర్చు పెట్టి వాస్తు ఆచరించడం అవసరం అని చెప్పవచ్చు. గృహనికి కొలతలు చూడడం పనివాళ్ళపని అని గృహస్థులు భావిస్తుంటారు. ఏ కొద్దిమందో పనివాళ్ళు మాత్రమే కొలతలు చక్కగా ఆచరించగలరే గాని చాలా మంది పనివాళ్ళు కొలతల విషయాన్ని సీరియస్ గా పట్టించుకొరు.

గృహనిర్మాణానికి స్థలం ఏర్పాటు అయినప్పటి నుండి, గృహనిర్మాణం పూర్తి అయ్యే వరకు ప్రతి దశలో(ఒక రకంగా చెప్పలంటే ప్రతిరోజు) కొలతల విషయంలో గృహ యజమానులే శ్రద్ధవహించడం చాలా అవసరం అని గుర్తుంచుకోండి. అంతే కాకుండా గృహం నిర్మించే పనివాళ్ళని కూడా కొలతల విషయంలో జాగ్రత్తగా ఉండేలా చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొలతలు చక్కగా ఆచారించాలంటే మంచి పనివాళ్ళు అవసరం.

గృహనిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని మొదట కొలతలు వేయాలి. స్థలం ఏ మూలలు, దిక్కులు పెరిగి యున్నదో గ్రహించాలి. నైరుతి
మూల మూలమట్టం వుంచి నైరుతిమూలలను తొంభై డిగ్రీలు వుండేటట్లుగా ఏర్పాటు చేసుకొని, తూర్పు, ఉత్తర ఈశాన్యాలు కొద్దిగా పెరుగునట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయునపుడు దక్షణం వైపు కొలత ఎంతవుందో అంతే కొలత ఉత్తరం కొలతగా వుండాలి. అదే విధంగా పశ్చమం కొలత ఎంతవుందో అదే కొలత తూర్పున కూడా వుండాలి.

నాలుగు దిక్కుల కొలతలే కాకుండా మూల కొలతలు చాలా ముఖ్యమైనవి.. వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు గల మూలకొలతను కొలవాలి. అదే విధంగా నైరుతి నుంచి ఈశాన్యం వరకు గల కొలతను కొలవాలి. ఆగ్నేయ వాయవ్యాల మూలకొలత కన్నా, నైరుతి ఈశాన్యాల కొలత ఎక్కువ ఉండాలని అందరు భావిస్తారు. ఈ విధంగా ఉంటే ఈశాన్యం పెరిగినట్లని వారి అభిప్రాయం. కాని నైరుతి మూల పెరిగి నైరుతి ఈశాన్యం కొలతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆగ్నేయ వాయవ్య కొలత ఎంత ఉందో అంతే కొలత నైరుతి ఈశాన్యం మూల కూడా ఉండేటట్లు చూడాలి. 

ఈ విధంగా చేసినప్పుడు రెండు మూలకొలతలు, ఎదుటెదుటి దిక్కుల కొలతలు సమంగా వుంటాయి. అప్పుడు నైరుతి ఈశాన్యం మూలకొలతలో ఒకటి రెండు అంగుళాలు పెంచుకోవాలి. స్థలంలో వివిధ మూలలు పెరిగి ఉన్నప్పుడు ఏ మూలను స్థిరం చేసుకొని కొలత ప్రారంభించాలి..? ఎటువైపు స్థలాన్ని వేరు చేసి వదిలితే మంచిది..? అనే విషయాన్ని స్థలాన్ని బట్టి నిర్ణయించాలే తప్ప ఫలానా పద్దతి మంచిదని రాయడం కష్టం. స్థలాన్ని అనుసరించి ఎటువైపు పెరిగిన స్థలాన్ని వదిలేస్తే మంచిదనే విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్థల నైసర్గిక స్వరూపము, గృహ ప్లాను, శాస్త్రవెత్త అనుభవం అధారపడి వుంటాయి.

ముగ్గు పోయడంలో జాగ్రత్తలు


స్థలం కొలతల ప్రకారం నిర్ణయించిన తరువాత గృహం ప్లానును నేలపై మార్కింగ్ వేయడం ముఖ్యమైనది. దీన్నే ముగ్గుపోయడం అంటారు. ముగ్గుపోసే విషయంలో గృహయజమాని, పనివారు, శాస్త్రవేత్త లేదా ఇంజనీరు ఒకరికొకరు సహకరించుకోవాలి. స్థలం ఎంత శుభ్రంగా ఉంటే అంత ఖచ్చితంగా కొలతలు ఆచరించవచ్చు. స్థలంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొలతలలో ఎక్కువగా తేడా వస్తుంది. ఇటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా కొలతలు వేయాలి. శుభ్రంగా లేని స్థలంలో ముగ్గుపోయడం తాత్కాలికంగా ఇబ్బందే కాకుండా చిరకాలం వుండాల్సిన ఇంటి కొలతలలో వచ్చే తేడా వలన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ముగ్గు పోయడానికి ముందుగా స్థలం శుభ్రంగా ఉండటం ఎంతైనా అవసరం.

గృహం ప్లాను ప్రకారం ముగ్గు పోసినప్పుడు గదులు గదులు, గృహము చాలా చిన్నవిగా కనపడతాయి. కాని అదే ప్లాను గృహం పూర్తి అయిన తరువాత పెద్దదిగా కనిపిస్తుంది. గదుల గోడల వెడల్పు కన్నా ముగ్గు గీతలు వెడల్పు ఎక్కువగా వుంటాయి. అందుకే ముగ్గు పోసినప్పుడు గదులు చిన్నవిగా కనిపిస్తాయి.

ముగ్గు పోసే విధానంలో కొంత అవగాహన ఉండాలి. అనుభవం అవసరం. ముగ్గు పోయడానికి ముందుగానే ఇంటి ప్లాను కాగితంపై గీయబడి ఉంటుంది. దాని ప్రకారమే ముగ్గు పోయాలి. మొదట గృహానికి దక్షిణ, పశ్చిమాలలో ఎంత ఖాళీ వదిలి వుందో తెలుసుకొని ఆ ఖాళీ స్థలానికి గృహం గోడ మందంలో సగం కొలత కలుపుకొని నైరుతి మూలలో ఒక మేకును నాటాలి. 

ఉదాహరణకు దక్షిణంలో నాలుగు అడుగులు, పశ్చిమంలో అయిదు ఖాళీ స్థలం వదలాలి అనుకొండి. దక్షిణం వైపు వదిలిన నాలుగు అడుగుల గోడ వెడల్పులో సగం కొలతను కలుపుకోవాలి. గోడమందం తొమ్మిది అంగుళాలు అనుకొంటే దక్షిణం వైపు నుంచి నాలుగు అడుగుల నాలుగున్నర అంగుళాలు కొలతను మార్కు చేసుకొని అదే విధంగా పశ్చిమం వైపు అయిదు అడుగుల నాలుగున్నర అంగుళాలు కొలచి ఈ రెండు కొలతలు కలిసిన చోట ఒక మేకును నాటాలి. ఈ మేకు వద్ద మూలమట్టం వుంచాలి. మూల మట్టాన్ని అనుసరించి నైరుతి మూల మేకు నుంచి ఆగ్నేయం వైపుకు ఒక దారం, వాయవ్యం వైపుకు ఒక దారం లాగాలి. ఈ దారాలు మూల మట్టానికి ఖచ్చితంగా సమంగా ఉండాలి.

మూలమట్టంలో దగ్గర ఉంచిన మేకు వద్ద నుంచి ఇకవైపు దారం మీద మూడు అడుగులు, మరోవైపు దారం మీద నాలుగు అడుగుల కొలతను గుర్తు వేసుకొని ఈ కొలతల మూలకొలతను కొలిస్తే ఈ కొలతలో మాత్రం పొరపాటు ఉండదు. కొలతలో మార్పు వచ్చిందంటే.. నైరుతి మూలమట్టానికి అనుసరించి కట్టిన దారాలు సరిగా 90 డిగ్రీలు లేవని గ్రహించండి. నైరుతి మూల 90 డిగ్రీలు ఉండునట్లు దారాలు ఏర్పాటు చేయాలి. అటు తర్వాత గృహ నిర్మాణానికి పునాదులు ఎంత వెడల్పుతో తవ్వుతారో ఆ కొలతను నైరుతి మూల మేకుకు ఇరువైపుల సమంగా పంచాలి.

ఉదాహరణకు పునాదులు వెడల్పు రెండు అడుగులు అనుకొంటే.. నైరుతి మూల మేకుకు ఒకవైపు ఒక అడుగుకు, రెండో వైపు ఒక అడుగుకు కొలతను ఏర్పాటు చేసి నైరుతి మూలనుంచి ఆగ్నేయం వరకు, నైరుతి మూల నుంచి వాయవ్యం వరకు దారాలను లాగాలి. ఆ తర్వాత దారాల మీదనే గది కొలతలు వేయాలి. నైరుతిలో నాటిన మేకు గృహానికి దక్షిణ, పశ్చిమం గోడ వెడల్పుకు మధ్యలో వుంటుంది. గదుల కొలతలను దారాలపై గుర్తిస్తూ, గదుల గోడ వెడల్పులో సగం వద్ద మేకులు నాటాలి. గది గోడల వెడల్పులో సగం కొలతకు ముగ్గు పోయడాన్ని 'సెంటర్ మార్కింగ్' అంటారు. సెంటర్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత పునాదుల వెడల్పును మేకుకు ఇరువైపుల సమంగా వుంచి ముగ్గు పోసుకోవడం జరుగుతుంది.

గృహం కోసం ముగ్గు పోసిన తర్వాత దక్షిణం-ఉత్తరం కొలతలు మరియు తూర్పు, పశ్చిమం కొలతలు సమంగా వున్నది లేనిది సరిచూసుకోవాలి. ఆగ్నేయం నుంచి వాయవ్యం వరకు మూలకొలత ఎంత ఉందో అంతే కొలత నైరుతి నుంచి ఈశాన్యం వరకు గల మూలకొలత ఉండాలి. ఈ విధంగా వున్న తరువాత నైరుతి నుంచి ఈశాన్యం వరకు గల మూలకొలత ఒకటి లేదా రెండు అంగుళాలు ఎక్కువగా వుండునట్లుగా ఏర్పాటు చేసుకోవాలి.

గృహానికి ఈశాన్యం పెరగాలని, ప్రతి గదికి ఈశాన్యం పెరగాలని అదే పనిగా ఈశాన్యం పెంచడం వలన స్థలంలో ఈశాన్యం తగ్గడమే కాకుండా, ప్రతిగదికి నైరుతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. గృహనిర్మాణం కోసం పునాదులు తవ్వినప్పుడు మేకులు, ముగ్గు గుర్తులు ఉండవు. కాబట్టి ముగ్గును దాటి మేకులను అనుసరించి మరిన్ని మేకులు నాటుకుంటే ఇంటి కొలతలో ఏ మాత్రం తేడా ఉండదు.

గృహానికి ముగ్గుపోయడం అయిన తర్వాత.. పునాదులు తవ్వడం పూర్తయి, గృహం నిర్మాణం మొదలవుతుంది. నిర్మాణం ప్రారంభంలో కూడా మూలమట్టం ప్రకారం నైరుతి 90 డిగ్రీలు ఏర్పాటు చేయడం గదుల ప్రకారం పునాదులు నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం నేలమీదికి వచ్చిన తర్వాత కూడా మేస్ మెంట్ వరకు గది కొలతల ప్రకారం నిర్మాణం జరుగుతుంది.

పునాదులలో నిర్మాణం గోడ వెడల్పు ఎక్కువగాను, నేలమీది నుంచి బేస్ మెంట్ గోడ వెడల్పు అంతకన్నా తక్కువగాను వుండి బేస్ మెంట్  మీద ఇంటి గోడ వెడల్పు నిర్మితం అవుతుంది. ముగ్గు పోసినప్పుడు ఏర్పాటు చేసిన 'సెంటర్ మార్కింగ్' మేకులు ఈ మూడు దశలకు ఒకే విధంగా ఉపయోగపడతాయి. గృహనిర్మాణం కొలతలు ఏదైనా కొద్దిగా పొరబాటు వుంటే బేస్ మెంట్ మీదనే సరిచేసుకోవాలిగాని అటు తర్వాత సరిచేయడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో అసాధ్యం.

బేస్ మెంట్ మీద ద్వారాలస్థానం నిర్ణయం చేసుకొని నిర్మాణం మొదలు అవుతుంది. ఈ నిర్మాణంపైన వివరించిన విధంగానే సరిచేసకొని గృహనిర్మాణం కొనసాగించాలి. బేస్ మెంట్ మీద ఒకసారి నిర్ణయించిన కొలతలు పొరపాటు రావడానికి అవకాశం లేదు. అంత మాత్రనా నిర్లక్ష్యం వుండకూడదు. గృహనిర్మాణంలో మూలమట్టం, టేపు, తూకం, దారం సరిగా ఉపయోగించని పక్షంలో కొలతలలో తేడా రావడానికి అవకాశం ఉంది. అందుకని మంచి పని వారినే గృహనిర్మాణంకు ఉపయోగించుకుని జాగ్రత్తగా పని ప్రారంభించాలి.


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.